తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ఉపాయం బీజేపీ నేతలకు ఇప్పటికీ తట్టడం లేదు. అటు ఆంధ్రాలోనే కాదు, ఇటు తెలంగాణాలోనూ బీజేపీ నాయకులు అర్జంటుగా వెంకటకృష్ణను పట్టేసుకుని, మచ్చిక చేసుకోవలసిన అవశ్యకత ఏర్పడింది. ఎవరీ వెంకటకృష్ణ అంటున్నారా? అదేనండీ ‘విప్లవోద్యమ’ నేపథ్యం గల వెంకటకృష్ణ… తెలంగాణాలోని ములుగు జిల్లా గోవిందరావుపేట సెంటర్ కు వెళ్లి ఎవరినడిగినా పుట్టు, పూర్వోత్తరాల వివరాలు పూస గుచ్చినట్లు తెలిసే వెంకటకృష్ణ. ఔను… జర్నలిస్టు పర్వతనేని వెంకటకృష్ణే. తెలుగు ఆర్నబ్ గోస్వామిగానూ ఆయనంటే గిట్టనివారు కొందరు ఉటంకిస్తుంటారు లెండి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు ఉన్నఫళంగా ఈ వెంకటకృష్ణను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఏర్పడింది.
ఎందుకంటే… ఆయనకు ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు వేల ఓట్లు ఉన్నాయ్ తెలుసా? నవ్వులాట కాదు… ఇది ఎవరో చెబుతున్న మాట కూడా కాదు. స్వయంగా వెంకటకృష్ణే వెల్లడించారు. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ లో గల వెంకటకృష్ణ నిన్న సాయంత్రం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో ‘డిబేట్’ కార్యక్రమం ద్వారా లైవ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ ఏమన్నారో తెలుసా? అది ఆయన మాటల్లోనే చదవండి..
‘‘అమరావతిలోనే అసెంబ్లీ, అమరావతిలోనే కౌన్సిల్, అమరావతిలోనే సెక్రటేరియట్, అమరాతిలోనే రాజ్ భవన్ ఉంటాయి… అని మీరిప్పుడు హామీ ఇవ్వండి లైవ్ లో… నేను… నాకు ఎంతో కొంత ఉన్న ఇరవై వేల ఓట్లో, ముప్పయి వేల ఓట్లో, యాభై వేల ఓట్లో ఉంటాయ్.., ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు వేల ఓట్లు ఉంటయ్… నాకంటూ ఒక ఇది ఉంది. మీరు ఆ మాట ఇవ్వండి. నేనొచ్చి బీజేపీ తరపున ప్రచారం చేస్తా..ఎస్.’’ అని వెంకటకృష్ణ అన్నారు.
ఏమైనా డౌటుందా? అయితే వెంకటకృష్ణ చేసిన ఆయా వ్యాఖ్యలను దాదాపు 21 నిమిషాల నిడివిగల కింది వీడియో లింకులో 12.30 నిమిషాల నుంచి 12.55 వ్యవధిలో చూడవచ్చు. ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలే కాదు, తెలంగాణా కాషాయ పార్టీ నాయకత్వం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోకతప్పదని మీరూ అంగీకరించక తప్పదు. వెంకటకృష్ణకు తెలంగాణాలోనూ ప్రాబల్యం ఉండి ఉండవచ్చు. ఆయన పుట్టి పెరిగింది గోవిందరావుపేటలోనే కాబట్టి. వెంకటకృష్ణ చేసిన ఆయా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులకు నవ్వుకోవలసిన అవసరం కూడా లేదని బీజేపీ నేతలు గుర్తించాలి మరి. ఒక్కో నియోజకవర్గంలో నాలుగైదు వేల ఓట్లు అంటే మాటలా? గెలవడానికే కాదు, గెలవలేని చోట ప్రత్యర్థి పార్టీని ఓడించడానికైనా వెంకటకృష్ణ ఓట్లు పనికొస్తాయ్!