జర్నలిస్టులకు సర్క్యులేషన్ పెంపుదల, యాడ్ రెవెన్యూ ‘వసూళ్ల’ డ్యూటీని అప్పగిస్తున్న కొన్ని మీడియా సంస్థల వ్యవహారం ఇటీవల బహిర్గతమైన సంగతి తెలిసిందే. వార్తలు రాయాల్సిన విలేకరులు పత్రికల సర్క్యులేషన్, యాడ్స్ కోసం రశీదు బుక్కులు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘బాబ్బాబు’ అంటూ ఏ గల్లీ నాయకుడినో పట్టుకుని ప్రాధేయపడాల్సిన పరిణామాలు ఉత్పన్నమయ్యాయి.
ఇందుకోసం కొన్ని సంస్థలు విలేకరులకు ‘బంపర్’ ఆఫర్లు కూడా ప్రకటించిన విషయం విదితమే. మరికొన్ని సంస్థలు కమిషన్ల ఆశ చూపుతున్నాయి. మొత్తంగా ప్రతి మండల విలేకరి నెలసరి దాదాపు రూ. 40 వేల మొత్తాన్ని వసూల్ చేసి పెడితే తప్ప సంస్థలో కొనసాగలేని దుస్థితి దాపురించింది. ఇదే దశలో సబ్ ఎడిటర్ ఉద్యోగాలు కోల్పోయి ‘బతుకు బజారు’ పాలైన జర్నలిస్టులు ‘కంట్రిబ్యూటర్’ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఈ మధ్య వెలుగు చూసిన పాత విషయాలే కదా? అని తీసిపారేయకండి. అక్కడే ఉంది అసలు మతలబు.
విలేకరులు యాడ్స్ సేకరించడం, సర్క్యులేషన్ పెంచడం వంటి పనులు చేయడం మీడియాలో ఇవాళ కొత్తేమీ కాదు. కాకపోతే గతంలో సందర్భానుసారం ఉండేది. ఏ వార్షికోత్సవానికో, లేదంటే ఏడాది పాటు కొన్ని కాపీలు స్థిరంగా నిలబడేందుకు మాత్రమే అడపా దడపా యాజమాన్యాలు ఇందుకు విలేకరులను ఉపయోగించుకునేవి. ఎన్నికల ప్యాకేజీల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.
కానీ తాజా పరిణామాలు అందుకు భిన్నంగా ఉండడమే అసలు అంశం. ఫలానా తేదీ లోపు, ఫలానా మొత్తాన్ని యాడ్స్ రూపేణా కలెక్ట్ చేయకపోయినా, నిర్దేశిత సంఖ్యలో పత్రిక కాపీలు పెంచకపోయినా ఉన్న ‘కంట్రిబ్యూటర్’ పోస్టు కాస్తా ఊస్ట్ అవుతుందని కొన్ని యాజమాన్యాలు లిఖితంగానే హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరులకు ప్రాణసంకటంగా మారిన తాజా గడ్డు పరిస్థితులకు కారణమేమిటనే అంశంపై లోతుగా ఆరా తీసినపుడు ‘ప్రింట్’ మీడియా బాగోతం బట్టబయలైంది.
ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో వివిధ పత్రికలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పలువురిని ప్రశ్నించినపుడు కరోనా మహమ్మారి ‘ప్రింట్’ మీడియాను ఎలా కాటేసిందో బహిర్గమైంది. పత్రికల సర్క్యులేషన్ కు ఏబీసీ సర్టిఫికెట్ ప్రామాణికమే కావచ్చు… కానీ ఎన్ని పత్రికలు ఏబీసీ సర్టిఫికెట్లను కలిగి ఉన్నాయి? అసలు ఏబీసీ ఆడిట్ కోసం దరఖాస్తు చేసుకున్న మీడియా సంస్థలెన్ని? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి ఏజెంట్లు, హాకర్లు చెప్పే విషయాలే ఈ అంశంలో ప్రామాణికమన్నది కాదనలేని వాస్తవం.
పలువురు ఏజెంట్లు, హాకర్ల కథనం ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ చిన్న పట్టణంలాంటి మండల కేంద్రం. దాని జనాభా సుమారు ఎనిమిది వేలు. ఇక్కడ కరోనాకు ముందు ఓ ప్రముఖ పత్రిక సర్క్యులేషన్ 360 కాపీలు. కానీ ప్రస్తుతం దాని కాపీల సంఖ్య 80 మాత్రమే. అంటే దాదాపు నాలుగో వంతుకు ఈ పత్రిక సర్య్కులేషన్ పతనమైందన్నమాట.
అదేవిధంగా తాజా గణాంక వివరాల ప్రకారం ఖమ్మం నగర జనాభా 3.39 లక్షలు. కరోనా పరిణామాలకు ముందు నగరంలో ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక సర్క్యులేషన్ ఇక్కడ 26,500 కాపీలు కాగా, ప్రస్తుతం అది పది వేల లోపునకు దిగజారినట్లు చెబుతున్నారు. అదేవిధంగా మరో ప్రముఖ పత్రిక కాపీలు గతంలో 7,500 కాగా, తాజాగా అది 1,500కు పడిపోయిందట. ఇంకో పత్రిక సర్క్యులేషన్ కరోనాకు ముందు నగరంలో 6,000 కాపీలు కాగా, ప్రస్తుతం వెయ్యి కాపీలలోపే విక్రయమవుతోందని ఏజెంట్ వర్గాల కథనం. తెలుగే కాదు ప్రముఖ ఆంగ్ల పత్రికల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదంటున్నారు.
ఇక ‘సంపుటి’పరంగా పెద్ద పత్రికలుగా చెలామణిలో గల మరికొన్ని పత్రికల పరిస్థితి మరీ దారుణమంటున్నారు. ఇంకొన్ని పత్రికలైతే ప్రభుత్వ యాడ్స్, లేదా ఎవరైనా మంత్రి, ఇతర ముఖ్య నేతలకు సంబంధించిన కమర్షియల్ ప్రకటనలు ఉన్నప్పుడు మాత్రమే ‘ప్రింట్’ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా సమయాల్లో డిజిటల్ ఎడిషన్, ఈ-పేపర్ వరకే పరిమితమవుతుండడం గమనార్హం.
ఈ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల సర్క్యులేషన్ సంఖ్యను కరోనాకు ముందు, తర్వాత ప్రాతిపదికన అంచనా వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాకర్లు, ఏజెంట్లు చెప్పే లెక్కలు నమ్మేది లేదని బుకాయించేవారు తమ పత్రిక సర్క్యులేషన్ కు సంబంధించి తాజా లెక్కల ఏబీసీ సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందనేది నిర్వివాదం.
కరోనా మహమ్మారి ఫలితంగానే ‘ప్రింట్’ మీడియా పరిస్థితి ఇలా దిగజారిందంటున్నారు. ఇటువంటి పరిణామాల్లో సర్క్యులేషన్ పెంచుకునేందుకు ‘ప్రమోషన్’ వర్క్ చేయించే సానుకూల పరిస్థితులు కూడా లేవు. దీంతో పలు పత్రికల యాజమాన్యాలు విలేకరుల ‘మెడ’పై కత్తిపెట్టి మరీ సర్క్యులేషన్, యాడ్ రెవెన్యూ పెంపుదలకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు వార్తలు రాసే విలేకరులే ఎందుకూ? అంటే… అందుకు గల కారణాలు మీడియా గురించి అవగాహన గల వారందరికీ తెలియనిదేమీ కాకపోవచ్చు!