అనవసరంగా మనం బ్రిటిష్ కాలం నాటి కట్టడాలను కీర్తిస్తుంటాం గానీ… మన కాంట్రాక్టర్లను మాత్రం అస్సలు మెచ్చుకోం. మన కాంట్రాక్టర్ల నిలువెత్తు నీతిని, నిజాయితీని, నిర్మాణపు ప్రతిభా శైలిని పొగడడానికి మనకు నోళ్లు కూడా రావు. ఎందుకంటే ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు మనకు అద్భుతంగా గోచరిస్తుంటాయి. కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంటాయి కూడా.
ఈ విషయంలో కొందరి మైండ్ సెట్ అస్సలు మారదు కూడా. ఎందుకంటే వందేళ్లు దాటినా బ్రిటిష్ కాలంనాటి కట్టడాలు చెక్కు చెదరవు కాబట్టి. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్న మున్నేరు నదిపై ఇప్పటికీ చెక్కు చెదరని వంతెన ఇందుకు ఓ ప్రబల నిదర్శనం.
కానీ కట్టిన అయిదేళ్లకే కుంగిపోయే విధంగా బ్రిడ్జిలను నిర్మిస్తున్న మన కాంట్రాక్టర్ల నైపుణ్యాన్ని మాత్రం మనం అస్సలు పట్టించుకోం. కావాలంటే పై ఫొటోను నిశితంగా పరిశీలించండి. కింద నుంచి నీటి ప్రవాహపు సవ్వడికి స్పందిస్తూ భరత నాట్యం చేస్తున్న భంగిమలు ఈ వంతెనలో కనిపించడం లేదూ? వాగునీటి లయలకు వంతెన హొయలు పోతున్నట్లు సాక్షాత్కరించడం లేదూ??
వంతెన డాన్స్ చేయడమేంటి? అని నివ్వెరపోవలసిన అవసరం లేదు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామం వద్ద 2015లో జంపన్న వాగుపై ఈ వంతెన నిర్మించారు. ఐటీడీఏ ద్వారా నిర్మించిన ఈ వంతెనను ఏ కాంట్రాక్టర్ పూర్తి చేశాడోగాని, అయిదేళ్ల వయస్సుకే మెలికలు తిరుగుతూ మరీ కుంగిపోతోంది. గడచిన పది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి దొడ్ల వంతెనకు పట్టిన దుస్థితి దృశ్యమిది.
అయిదేళ్లకే నూరేళ్లు నిండినట్లు కనిపిస్తున్న వంతెనపై నుంచి వెళ్లేందుకు మల్యాల, కొండాయి, అయిలాపురం తదితర గిరిజన గూడేల ప్రజలు గజగజ వణికపోతున్నారట. ఇంత పటిష్టంగా ఈ వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్ కు ఉత్తమ గుత్తేదారుగా మన సర్కారు సార్లు ఓ బహుమతి కూడా ప్రకటిస్తే మరింత సంతోషం కదా!