ఓ ప్రముఖ పత్రికలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న 34 ఏళ్ల యువ జర్నలిస్టు కరోనా బారిన పడ్డారు. దీంతో అతను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకిందనే కారణంతో సదరు ప్రముఖ పత్రిక ఆ యువ జర్నలిస్టును ఉద్యోగం నుంచి తొలగించిందట. ఓవైపు కరోనా బారిన పడడం, మరోవైపు యాజమాన్యం ఉద్యోగాన్ని తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జర్నలిస్టు ఎయిమ్స్ ఆసుపత్రి భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోబోయారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే గమనించి తీవ్ర గాయాలపాలైన జర్నలిస్టును ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది సోమవారం జరిగిన విషాద ఘటన. కరోనా కల్లోలంలో జర్నలిస్టుల పట్ల మీడియా యాజమాన్యాల దాష్టీకానికి ఢిల్లీ ఘటన ఓ ప్రబల నిదర్శనం. ఇందులో సందేహమే లేదు. వైరస్ సోకినంత మాత్రాన ఉద్యోగం తీసేయడం దుర్మార్గం కాక మరేమిటి? ఢిల్లీ ఘటన నేపథ్యంలోనే… మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పత్రికగా వెలుగొందుతున్న ఓ మీడియా యాజమాన్యపు తాజా దురాగతం గురించి కూడా తెలుసుకుందాం.
తమ సంస్థలోని ఫొటో జర్నలిస్టులకు మంగళం పాడే దిశగా తెలుగు మీడియాలోని ఓ ప్రముఖ పత్రిక యాజమాన్యం అడుగులు వేస్తోంది. మొత్తం 25 మంది స్టాఫ్ ఫొటో జర్నలిస్టుల జాబితాను తయారు చేసి వారిని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదుగురు ఫొటో జర్నలిస్టుల నుంచి రాజీనామా లేఖలను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఓ ఫొటో జర్నలిస్టు ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయాడట. తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఓ లేఖ రాసి యాజమాన్యానికి పంపినట్లు తెలుస్తోంది.
అనూహ్యపరిణామంతో కంగారుపడిన యాజమాన్యం సూసైడ్ లేఖ రాసిన ఉత్తర తెలంగాణాలోని ఫొటో జర్నలిస్టు కొలువు అంశంలో ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు సంస్థ ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. మిగతా నలుగురు ఫొటో జర్నలిస్టులను మాత్రం ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. మరికొందరి నుంచి రాజీనామాలు కోరిందట. ఢిల్లీ జర్నలిస్టు ఆత్మహత్యాయత్నపు ఘటనను ఈ ప్రముఖ పత్రిక తన వెబ్ సైట్ లో ప్రముఖంగా ప్రచురించడం ఈ సందర్భంగా గమనార్హం. కానీ తన సంస్థలోని ఫొటో జర్నలిస్టుల ఉద్యోగాలపై కత్తి వేలాడదీసి రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తోందట. ఈ అంశంలో తన పని తాను చేసుకుంటూ పోతోందట. ఢిల్లీ జర్నలిస్టు ఘటనపై నీతులు బోధిస్తున్న తరహాలో వార్తా కథనం ప్రచురించిన ఈ ప్రముఖ పత్రిక తన సంస్థలోని ఫొటో జర్నలిస్టుల ఉద్యోగాల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తుండడమే అసలు విషాదం.