తెలంగాణాలోని మరో మూడు పట్టణాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని రామగుండం, సిద్దిపేట, నల్లగొండలోనూ త్వరలో ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తామని, వచ్చే రెండేళ్లలో ఐటీ టవర్లను ప్రారంభిస్తామని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ రంగంలో మంచి పురోగతి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని, సీఎం కేసీఆర్‌ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్ లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే కరోనా కారణంగా సాదాసీదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2020-21లో రూ.9.78 లక్షల కోట్లు కాగా, వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. అదేవిధంగా దేశ తలసరి ఆదాయం రూ. 1,27,768గా కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,27,145గా ఉందన్నారు. రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ 2019-20లో రూ.1.28 లక్షల కోట్లు కాగా, 2020-21లో అవి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని, దేశంతో పోలిస్తే రెట్టింపు ఐటీ వృద్ధి సాధించామని, జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, ఏడేండ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపయిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఐటీ రంగం 6.28 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నదని, సుమారు 20 లక్షలకుపైగా మంది ఐటీ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు. ఇందుకోసం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని, ప్రముఖ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని, పెట్టుబడులు, అంకెలే వృద్ధికి సంకేతంగా చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలకూ శరవేగంగా ఐటీ విస్తరిస్తున్నదని, కార్యాలయాల విస్తీర్ణంలో బెంగళూరును అధిగమించినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, మహబూబ్‌నగర్‌ దివిటి ప్రాంతంలో త్వరలో సోలార్‌ పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నామని కేటీఆర్ వివరించారు.

Comments are closed.

Exit mobile version