టీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) విలీనమైంది. ఈమేరకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కొద్దిసేపటి క్రితం విలీనపు లేఖను అందించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నది ఈ రెండు నియోజకవర్గాలే కావడం గమనార్హం.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలోనే టీఆర్ఎస్ లో చేరారు. ఇదే సందర్భంగా మెచ్చా నాగేశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే ఎందువల్లనో ఆయన చేరికకు అప్పట్లో బ్రేక్ పడింది. తాజాగా మెచ్చా నాగేశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం, ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి లేఖ ఇచ్చారు. దీంతో తెలంగాణా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం కోల్పోయినట్లుగానే భావించవచ్చు.

Comments are closed.

Exit mobile version