వ్యాక్సిన్ కంపెనీలకు సహకరిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈమేరకు రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అవసరమైన మందులు, వాక్సిన్ సరఫరాపై చర్చించేందుకు ఈరోజు మంత్రి కేటీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వ్యాక్సిన్ తయారీదారులు, ఫార్మా సంస్థలతో శుక్రవారం ప్రగతిభవన్లో సమావేశమైంది. కోవిడ్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న (రెమ్డేసివిర్ వంటి) మందులను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలతో విస్తృతంగా చర్చించిన టాస్క్ ఫోర్స్, ఆ మందుల ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఫార్మా కంపెనీలతో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం వ్యాక్సిన్ తయారు చేస్తున్న పలు కంపెనీల ప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ బృందం చర్చలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా సంస్థల వాక్సిన్ సప్లై పెంపుదలకు ఉన్న అవకాశాలు, వాటికి సంబంధించిన గడువులు (టైమ్ లైన్స్), వాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యల వంటి వివిధ అంశాలపైన కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ వంటి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రో-యాక్టివ్ గా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వివిధ వ్యాక్సిన్లను దేశంలో తయారుచేసే అవకాశాలున్న ఫార్మా కంపెనీలతో కూడా టాస్క్ ఫోర్స్ ఈరోజు చర్చించింది. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యంతో తమ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుందని ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి అవసరమైన వాక్సిన్ల ప్రోక్యూర్మెంట్ అంశం పైన స్థానికంగా ఉన్న కంపెనీలతో పాటు అంతర్జాతీయంగా, అందుబాటులోకి వచ్చిన వివిధ వాక్సిన్ సంస్థలతో కూడా సంప్రదింపులు చేస్తామని తెలిపారు. భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఆయా వ్యాక్సిన్ లను ప్రోక్యూర్ చేసుకునేలా ఇప్పటినుంచే ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని నిర్ణయించింది.

ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి నాట్కో ఫార్మా, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్మునోలాజికల్స్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలకి చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉన్న ఉన్నతాధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియ,రాహుల్ బొజ్జా, రాజశేఖర్ రెడ్డిలతోపాటు టిఎస్ఐఐసి ఎం.డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version