‘తెలంగాణ ప్రాంతం భారతదేశంలో లేదా ? తెలంగాణ ప్రజలు భారతీయులు కారా? సంక్షేమం అందించే కీలక పథకాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకంత వివక్ష చూపుతోంది ?’ అని టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత , ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు . రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఏడేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరును తన ప్రసంగం ద్వారా ఎండగట్టారు.

ప్రధానంగా విభజన హామీలు, ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలనీ, రైతులకు సంబంధించిన కీలక అంశమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ, పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు గురించిన చర్చే లేదన్నారు. ముఖ్యంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ నామ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో 14 వ పేజీలో డా . బీఆర్ అంబేద్కర్ ఆదర్శాలను ప్రభుత్వ నినాదంగా ఉటంకించారని, అయితే రాజ్యాంగంలో డా . బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత అంశాలను సమైక్య నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందన్నది వాస్తవమని ఎంపీ నామ అన్నారు.

డా . బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకోసం తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పదిహేనేండ్ల పాటు ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ తో పాటు, ఇతరత్రా కారణాలతో దేశం యావత్తూ ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందనీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేక తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. కనీస మద్దతు ధరల్లేక రైతులు అన్నివిధాలుగా అప్పులపాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఈ సభ ద్వారా దేశానికి తెలియజేయాలి అనుకుంటున్నానని ఎంపీ నామ తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో తాగు నీరు, సాగు నీరు కొరత ఉండేది, అలాగే విద్యుత్ సమస్య ఉండేదని, 25 నుండి 30 లక్షల మంది నిరుద్యోగులు గల్ఫ్ ఇతర రాష్ట్రాలకు పనులకు వలస వెళ్లేవారన్నారు. సముద్ర మట్టానికి ఎగువన ఉండే తెలంగాణ రాష్ట్రంలో 300 నుండి 400 అడుగులు వేసిన బోరులు పడేవి కాదని, అలాంటి సమయంలో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన తమ నేత కెసిఆర్ తర్వాత ప్రతి ఇంటికి త్రాగు నీరు ఇవ్వాలని సంకల్పించి దేశంలోనే మొట్ట మొదటి సారి తెలంగాణలో ఇంటింటింకి త్రాగు నీరు అందించారన్నారు. విషయమై కేంద్ర జలశక్తి మంత్రి 100 శాతం ఇంటింటికి తాగు నీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారని, ఈ విషయంలో ప్రశంసలు కురుపిస్తున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. నీతి అయోగ్ సిఫార్సులు మేరకు మిషన్ భగీరధకు రూ.19,205 కోట్లు, అలాగే కాకతీయుల కాలం నాటి చెరువులు అభివృద్ధి చేయటం జరిగిందన్నారు దానికి రూ. 5,000 కోట్లు ఇవ్వాలన్నారు. ఈ రెండింటికి కలిపి రూ. 24,000 కోట్లు ఇవ్వాలని 2016లో నీతిఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రికి , కేంద్రమంత్రులకు అనేక లేఖలు రాయడం జరిగిందని, అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గత సెషన్లో తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు గురించి తాము ఆందోళన చేయడం జరిగిందపి, అయినా పూర్తి స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో అయినా ధాన్యం సేకరణలో జాతీయ పాలసీ తీసుకురావాలన్నారు. పియం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 2 వేలు మూడు విడతల్లో 6 వేలు ఇస్తున్నారని, అయితే తమ తెలంగాణ రాష్ట్రంలో సియం కేసిఆర్ రైతు బంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 50,000 కోట్లు ఇవ్వడంతో పాటు, ఏదైన కారణంతో చనిపోయిన రైతులకు రూ. 5 లక్షలు రైతు భీమా ఇస్తున్నారన్నారు. అంతే కాకుండా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, కరోన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలను ప్రభుత్వం ఆదుకుందన్నారు.

పామాయిల్ సేద్యంలో తెలంగాణ నెం.1 గా ఉన్నదనీ, తాను ప్రాతినిధ్యం వహించే ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, రాబోవు రోజుల్లో కొత్తగా మరో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహించనున్నామని. 12 పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండిండ్లకు ఇప్పటి వరకూ 10 లక్షల మంది లబ్దిదారులకు రూ.7 వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఇంటింటికీ తాగునీరు లాంటి బృహత్తర పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలుచేయాలని ఎంపీ నామ డిమాండ్ చేశారు.

పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. ఇలాంటి రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయలేదన్నారు . కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలేదన్నారు. దేశ వ్యప్తంగా 157 మెడికల్ కాలేజీలు, 07 ఐఐఎం, 07 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 84 నవోదయ విద్యాలయాలు, 04 ఎస్ఐడీలు మంజూరుచేసి తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. 2012-13లో తెలంగాణ ప్రాంతానికి మంజూరైన ఐటీఐఆర్ వెనక్కి తీసుకున్నారనీ, దానిని మళ్లీ తెలంగాణకు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఏపీలో ఏడు మండలాలు కలిపేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు , గిరిజనులకు , ఓబీసీలకు , ఎస్సీ వర్గీకరణపై రిజర్వేషన్లు కల్పించాలని 2014 లోనే శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపామనీ, నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ నామ అన్నారు.

Comments are closed.

Exit mobile version